మంత్రి గంగులకు తృటిలో తప్పిన నాటు పడవ ప్రమాదం

మంత్రి గంగుల కమలాకర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చెరువుల పండుగను నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్ లో జరిగిన చెరువుల పండుగ కార్యక్రమానికి గంగుల హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన నాటు పడవలోకి ఎక్కాలని బీఆర్ఎస్ నేతలు గంగులను కోరారు. వారి కోరిక మేరకు ఆయన పడవ ఎక్కారు. 

అయితే పడవ అటూఇటూ ఊగుతూ మునిగిపోయింది. పట్టు కోల్పోయిన గంగుల నీళ్లలోకి పడిపోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆయన మరో కార్యక్రమానికి హాజరుకావడానికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


Gangula Kamalakar
BRS
Boat

More Telugu News